World's first medical networking and resource portal

Community Weblogs

Nov16
మనకు వచ్చే జబ్బులు అనేక రకాలు. కీళ్ళ వాతం, చక్కెర వ్యాధి, రక్తపోటు లాంటివి వారసత్వంగా వస్తాయి. జలుబు, విరేచనాలు, టీబీ లాంటి అంటువ్యాధులు మన ప్రమేయం లేకుండా సోకుతాయి. ఉండే వాతావరణం, పరిసరాలను బట్టి కొన్ని జబ్బులు వస్తే, మన అజాగర్తలవల్ల (ప్రమాదాలువల్ల తగిలే గాయాలు) మరికొన్ని జబ్బులు వస్తాయి. అవికాక మనకు మనం కొనితెచ్చుకొనే (సుఖవ్యాధులు, ఆల్కహాలు సంబంధిత రోగాలు) ఉండనే ఉన్నాయి. ఏ జబ్బు రావటానికి అయినా కొన్ని కారణాలు ఉంటాయి. వచ్చాక దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. జబ్బు స్వభావాన్ని బట్టి అది పూర్తిగా నయం కావటమో (జలుబు, మలేరియా), కొంత నష్టాన్ని మిగిల్చిపోవటమో (పోలియో, పక్షవాతం), జీవితాంతం ఉండటమో (చక్కెర జబ్బు, ఎయిడ్స్) జరుగుతుంది. ఇది జబ్బుల సహజ స్వభావం. అందుకనే వైద్యంతో జాగర్త తీసుకోవాలి. డాక్టరు సూచించిన ప్రకారం మందులు వేసుకోవటం, జాగర్తలు పాటించడం, తగినంతకాలం వైద్య పర్యవేక్షణ మొదలైన పద్ధతుల్ని పాటించడం ముఖ్యం. కానీ కొంతమంది నమ్మకాలు, విశ్వాసాలు మనసులో దూర్చుకొని వాటిని పరిశీలించరు. ప్రశ్నించరు. ఎవరు ఏది చెబితే అదే. ఎంత గట్టిగా చెబితే అంత గట్టిగా మనసులో నాటుకుంటారు. దాని ప్రకారమే వారి నమ్మకాలు ఉంటాయి. జబ్బుల్ని కూడా అదే నమ్మకాలతో చూస్తారు. జబ్బు తగ్గించుకోవటంలో అడుగడుగునా తెలియకుండా అడ్డుతగులుతుంటారు. జబ్బు తనకు వచ్చినా సరే, ఇతరులకు వచ్చినా సరే. ఇలా ఒక పక్క రోగాన్ని పూర్తిగా శాస్ర్తియ దృక్పథంతో చూసేవారినుండి అత్యంత మూఢ విశ్వాసాలతో చూసేవారి వరకూ అనేక స్థాయిల్లో జనం ఉంటారు. ఇవన్నీ కాకుండా రోగాన్ని గుర్తించడం, దానికి సరైన వైద్యం చేయించుకుంటేనే అది దారిలోకి వస్తుంది. చంటిబిడ్డకు విరేచనాలు అయినపుడు ఒంట్లో నీరంతా పోతుంది. దాంతోపాటే లవణాలు పోతాయి. దాంతో బిడ్డ నీరసపడిపోతాడు. డాక్టరును కలిస్తే మందులతోపాటు నీరు, పళ్ళ రసాలు బాగా తాపించమని సలహా ఇచ్చారు. తల్లి ఇంటికి వచ్చి నీరు తాపించబోయింది. కొందరికి నీళ్ళు తాగితే విరోచనాలు ఎక్కువ అవుతాయనే ఓ నమ్మకం. దాంతో బిడ్డకు కావాల్సిన నీటిని ఇవ్వలేదు. రెండోరోజు బిడ్డకు మూత్రపిండాలు పాడైపోయాయి. దాన్నుండి పిల్లవాడిని కాపాడుకోవడానికి యాభై వేలు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఇక్కడ ఒంట్లో నీరు, లవణాలు పోవటం వాస్తవం. దానికి జరగాల్సిన వైద్యం వాటిని శరీరంలోకి ఇవ్వటం. కానీ వైద్యం జరగకుండా ‘నమ్మకం’ అడ్డుపడింది. ఫలితం బిడ్డకు చావు వరకూ లాక్కొచ్చింది. తల్లిదండ్రులు ఆ డబ్బులు కూడా పెట్టుకోలేకపోతే ఒక నిండు ప్రాణం కేవలం ‘నమ్మకం’వల్ల బలి అయ్యేది. ఏ కారణం చేతనైనా మెదడుకు రక్తసరఫరాలో ఆటంకం వస్తే పక్షవాతం వస్తుంది. ఇది వాస్తవం. దానికి మీ నమ్మకాలతో పనిలేదు. జరిగిన వెంటనే వైద్యం మొదలుపెడితే రక్తసరఫరా తిరిగి మొదలై (నిర్దిష్ట సమయంలో) పక్షవాతం నుండి కోలుకోవచ్చు. లేదా కనీసం ఎక్కువ మెదడు పాడుకాకుండా జరగబోయే నష్టాన్ని తగ్గించవచ్చు. సమస్య వచ్చాక ఎంత త్వరగా వైద్యం మొదలుపెట్టామనే దాన్ని బట్టి జబ్బు నుండి కోలుకోవటం ఆధారపడి ఉంటుంది. ఇది శాస్ర్తియ వైద్యం. దీనికి పక్షవాతం పట్ల మీకు ఉన్న నమ్మకాలు ముడిపెడితే నష్టాన్ని భరించక తప్పదు. పక్షవాతానికి నాటుమందు పనిచేస్తుందనే ‘నమ్మకం’ మీకుందనుకోండి. మీరు నేరుగా డాక్టరు దగ్గరకు పోకుండా నాటు వైద్యుని దగ్గరకు పోతారు. వైద్యం (నాటు) చేయిస్తున్నాం కదా! తగ్గుతుందనే నమ్మకం మీకు ఉండొచ్చు. ఆ నమ్మకం మెదడులో జరిగే మార్పును ఆపలేదు. జరిగాక నా ఖర్మలే అనుకోవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. పప్పుతింటే చీము పడుతుంది అనుకొంటారు కానీ కొల్లాజన్ అనే ప్రొటీను పప్పులో ఉంటుంది. దీనివల్ల గాయం త్వరగా మానుతుంది. వేడి చేసే వస్తువులు తినకూడదు అనేది ఓ నమ్మకం. కానీ ఆహారంలో అలాంటివేమీ ఉండవు తినకపోవటంవల్ల పోషకాహార లోపం ఏర్పడవచ్చు. బాలింతకు స్నానం చేయించకూడదని కొందరికి అలవాటు అయివుంటుంది. కానీ శుభ్రత లేనందువల్ల తల్లికీ, బిడ్డకూ అనారోగ్యం ఏర్పడుతుంది. కామెర్లకు అల్లోపతిలో మందు లేదని చాలామంది అనుకొంటుంటారు. కానీ కామెర్లు జబ్బు కాదు. రోగ లక్షణం. కామెర్లు రావటానికి సవాలక్ష కారణాలు. రోగికి వైద్యం పట్ల అవగాహన లేకపోయినా ఫర్వాలేదు కనీసం వైద్యులు చెప్పినదాన్ని పాటించే తటస్థ విధానాన్ని అయినా పాటిస్తే మేలు.


Comments (0)  |   Category (General)  |   Views (1462)

Community Comments
User Rating
Rate It


Post your comments

 
Browse Archive